మనస్సు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే మనం తినే ఆహారంతోనే సాధ్యమవుతుందని మీకు తెలుసా? చాలామంది మూడ్ బాగోపోతే వెంటనే కాఫీ, టీలను సేవిస్తుంటే.. మరికొందరు స్వీట్ల వంటివి తెగ లాగించేస్తుంటారు. నిజానికి ఇవి మనసుని ఆ కాసేపు ఉత్సాహపరచవచ్చేమోగానీ, ఆ తర్వాత వీటితో దుష్ప్రభావాలు ఎక్కువే అంటున్నారు నిపుణులు. దీనికన్నా పోషకాలు మెండుగా ఉన్న ఆహారం తీసుకోవటం చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు.
ఇవి చాలా త్వరగా మన మూడ్నీ మార్చే స్తాయనీ వీరు అంటున్నారు. మరి అవేంటో ఒకసారి చూద్దాం.
సెరటోనిన్ : మూడ్ని కంట్రోల్ చేయడంలో సెరటోనిన్ పాత్ర చాలా కీలకమైంది. ఇది మెదడులో న్యూరో ట్రాన్స్మీటర్గా పనిచేస్తుంది. ఈ సెరటోనిన్ ఎక్కువగా పొందాలంటే పాలు, చేమదుంపలు, చేమకూర, జీడిపప్పులను తింటే సరి.
ఫోలిక్ యాసిడ్, బి6 విటమిన్ : ఒకోసారి మనకు వచ్చే సమస్యలు మనల్ని కుంగదీసినట్లు చేస్తాయి. ఇలాంటి పరిస్థితి నుండి బయటపడాలంటే ఈ రెండు విటమిన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి తాజా కూరగాయలు, కాలేయం, పప్పుల్లో పుష్కలంగా ఉంటాయి.
మోనోసాచ్యురేటెడ్ కొవ్వు, పొటాషియం : ఇవి మెదడుని ఆరోగ్యంగా ఉంచుతాయి. మెదడులోని నాడీకణాల్ని ఉత్తేజంగా ఉండేలా చేయటంలో పొటాషియం తోడ్పడుతుంది. బాదంపప్పు, వేరుశనగల్లో ఆరోగ్యకరమైన మోనో సాచ్యురేటెడ్ కొవ్వు ఉంటుంది. అలాగే అరటిపండు, చిలకడదుంపల్లో పొటాషియం దండిగా ఉంటుంది.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు: మానసికంగా ఏకాగ్రత కలిగి ఉండడానికి, విశ్రాంతి, కలుపుగోలుతనం పెంపొందటానికి ఒమేగా-3 కొవ్వులు సాయం చేస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచే ఈ కొవ్వు ఆమ్లాలు లోపించటంతో కుంగుబాటు, చిరాకు, బాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని పొందాలంటే ఆకుకూరలు, చేపలు, అవిసెగింజలు తీసుకోండి.
సేకరణ: ప్రజాశక్తి, జీవన







0 comments:
Post a Comment