Pages

Subscribe:

Ads 468x60px

Sunday, 15 September 2013

మహిళలలో పోషహర లోపం

ఆదివారం సెలవు రోజు. కాస్త ఆలస్యంగా నిద్రలేచినా ఫర్వాలేదనుకునే సగటు ఇల్లాలికి ఆ రోజే ఎక్కువ పనిభారం అనివార్యమవుతుంది. సెలవు కావడంతో ఇంట్లో భర్త, పిల్లలు ఉంటారు. తి నడానికి వారు కోరుకున్నవి చేసిపెట్టాలి. చేపలు తెస్తే ఒకరు పులుసు పెట్టమంటారు, మరొకరు ఫ్రై చేయమంటారు. నాకు నాన్‌వెజ్ వద్దు, కాయగూరలతో కర్రీ వండమని మరొకరు అంటారు.
వీరందరూ కోరుకున్నవి చేసి, భోజనాలు అయ్యేసరికి మధ్యాహ్నం రెండ వుతుంది. నాలుగు మెతుకులు నోట్లో వేసుకొని, కాస్త నడుం వాల్చుదామనే సమయమే ఆ ఇల్లాలికి దక్కడం లేదు. నిత్యం ఇంటి పని మొత్తం చేసుకునే మహిళలకు కడుపునిండా తినేందుకు కూడా తీరిక ఉండదు. ఈ చేప ముక్క ఉంటే తర్వాత ఎవరో ఒకరు తింటారులే..! అని దాన్ని దాచిపెట్టి మరీ పిల్లల చేత తినిపించే తల్లులకు కొదవలేదు. అందుకే అమ్మ త్యాగానికి ప్రతీక అయింది.

ఓ వైపు సామాజికంగా అసమానతలకు గురయ్యే మహిళలు పోషకాహార విషయంలోనూ వివక్షకు గురవుతున్నారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలలో నెలకొనే సామాజిక జీవన ప్రమాణాలే ఇందుకు నిదర్శనం. ఆదాయం కుటుంబపోషణకు సరిపోక ఉన్నదాంట్లోనే సర్దుకుపోవాలని సగటు మహిళ భా విస్తుంది. ఇంట్లో అందరూ భోంచేసిన తరువాతే తాను తింటుంది. ఫలితంగా చాలామంది మహిళలు పోషకాహార లేమితో బాధపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో పిల్లల్లో ఎదుగుదల లోపం, మహిళలు పోషకాహారలేమితో బాధపడుతన్నట్లు, ఈ సమస్య ముఖ్యంగా ఆసియా దేశాల్లో అధికంగా కనిపిస్తున్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంత ఉమ్మడి కుటుంబాలలో మగపిల్లలు, ఆడపిల్లల ఎదుగుదలలో తీవ్రమైన వ్యత్యాసం ఉన్నట్లు, పోషకాహారం అందించే విషయంలో ఆడపిల్లల పట్ల వివక్ష కొనసాగుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ఇళ్లలో ముందుగా మగపిల్లలకు భోజనం పెట్టిన తరువాతే ఆడపిల్లలకు పెట్టే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఫలితంగా మన దేశంలో మహిళలు, బాలికలు పోషకాహార లేమితో బాధపడుతున్నట్లు వెల్లడైంది. వేళకు తినకపోవటం వల్ల, సరైన పోషకాలు అందక వీరు పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎత్తు, బరువు తదితర విషయాల్లో సమతుల్యత లోపిస్తున్నట్లు కొలంబియా యూనివర్శిటీ ఆర్థిక శాస్తవ్రేత్త అరవింద్ పన్‌గారియా అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్తారింటికి వచ్చే కొత్తకోడళ్లు, వారి పిల్లలు పొట్టిగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రపంచం మొత్తమీద రక్తహీనతతో బాధపడే మహిళలు మనదేశంలోనే అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంత మహిళలు, బాలికల్లో 60 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అయితే, రక్తంలో ఇనుము తదితరాల కోసం ఐరన్ మాత్రలు తీసుకునే బదులు ఇనుము ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడమే మంచిది. కానీ, ఇలాంటి నాణ్యమైన పోషకాహారమే వారికి లభించడం లేదు. ప్రముఖ ఆర్థివేత్త డాక్టర్ అమర్త్య సేన్ అన్నట్లు సగటు భారతీయుడికి సమతుల్య ఆహారం దొరకటం నేడు గగనమవుతోంది. ప్రభుత్వాలు ఆహారభద్రత చట్టం లాంటివి ఎన్ని తెచ్చినా ప్రయోజనం అంతంత మాత్రమే. పోషకాలు ఉండే ఆహార పదార్థాలన్నీ కాస్త ఖరీదు ఎక్కువగానే ఉంటున్నాయి. అందుకే ధర తక్కువగా ఉండే చిరుధాన్యాలు తదితర ఆహార పదార్థాలను తీసుకుంటే ఎంతో మంచిది. సుమారు యాభై ఏళ్ల క్రితం గ్రామీణ ప్రాంతాలలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలలో చిన్నా, పెద్ద మొదలు అందరూ జొన్న,సజ్జలు,రాగులు లాంటి తృణధాన్యాలను ఆ హారంగా తీసుకునేవారు. వీరు శారీరక శ్రమ అధికంగా చేసేవారు కాబట్టి ధృడంగా, ఆరోగ్యంగా ఉండేవారు. రానురానూ జీవనశైలిలో వచ్చిన మార్పుతో పాటు ఆర్థికలేమి వారిని చౌకగా లభించే పోషకాహారం నుంచి దూరం చే స్తోంది. ఒకే కుటుంబంలో ఉండే ఆడ, మగపిల్లల శారీరక ఎదుగుదలను గనుక పరిశీలిస్తే ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. ఎత్తు, లావు, చురుకుదనం తదితర విషయాల్లో విపరీతమైన తేడా ఉంటోంది. అలాగే, పిల్లల్లో శారీరక సామర్థ్యం కూడా చాలా తక్కువ ఉన్నట్లు వెల్లడైంది. టీవీలకు, ఇంటర్నెట్ గేమ్స్‌కు అతుక్కుపోతూ చిన్నారులు శారీరక శ్రమను నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం గంటసేపు కూడా పరుగెత్తలేని పరిస్థితిలో గ్రామీణ ప్రాంత పిల్లలు ఉన్నారు.

చిన్నతనంలో ఆటల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. క్రీడలతో శారీరక, మానసిక ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది. ఆటల వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఫలితంగా పిల్లల్లో ఎదుగుదల ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ పేదరికం పిల్లలకు పెను శాపంగా మారి వారి ఎదుగుదలను కుంగదీస్తోంది. వాస్తవానికి మగపిల్లల్లో ఎదుగుదల జీవితంలో మూడుసార్లు జరుగుతుంది. ఆ సమయంలో సరైన పోషకాహారం తీసుకుంటే వారు ఎత్తు పెరుగుతారని ప్రిన్స్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అంగ్స్ డీటన్ అంటున్నారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న పోషకాహార సమస్యపై సమరభేరి మోగించకుంటే- రాబోయే కాలంలో మన పిల్లల భవిష్యత్తును చేజేతులారా మనమే నాశనం చేసుకున్నవారమవుతాం. ‘మొక్కై వంగనిది మానై వంగుతుందా?’- అన్నట్లు బిడ్డ కడుపులో పడగానే తగు జాగ్రత్తలు తీసుకుంటే అటు తల్లులకు, ఇటు పిల్లలకు ఎంతో మంచిది. తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని వృద్ధిచేసుకున్నవారమవుతాం.

సేకరణ: ఆంధ్రభూమి

0 comments:

Post a Comment